విజయవాడ: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, జగన్ అధికారంలోకి వచ్చాక 106 మద్యం బ్రాండ్లు వచ్చాయని టీడీపీ పాలిట్బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వర్రావు ఆరోపించారు. జగన్ సర్కార్కు దమ్ముంటే మద్యం బ్రాండ్లను టెస్ట్ చేయించాలని సవాల్ విసిరారు. విష రసాయనాలు కలిసి ఉన్న మద్యం సేవిస్తూ ఎందరో చనిపోతున్నా.. ప్రభుత్వానికి పట్టింపులేకపోయిందన్నారు.
రాష్ట్రంలో ఇప్పుడున్న బ్రాండ్స్ మంచివే అని మంత్రి అంబటి చెప్పడాన్ని ప్రస్తావించగా.. బ్రాండ్లు అన్నీ మంచివే అని చెప్పడానికి ఆయనేమన్నా మద్యం శాస్త్రవేత్తా? అని ఎగతాళిచేశారు. నిత్యం ఎందరో చనిపోతున్న సంఘటనలే బ్రాండ్ల గొప్పతనాన్ని వెల్లడిస్తున్నాయన్నారు. వైసీపీ నేతలు డిస్టిలరీలను తమ చేతుల్లోకి తీసుకుని నకిలీ మద్యం తయారుచేస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని మద్యం బ్రాండ్లను టెస్ట్ చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతున్నదని, ఈ డబ్బంతా తాడేపల్లి ప్యాలేస్కు వెళ్తుందని బోండా ఉమా ఆరోపించారు. కల్తీ మద్యం కారణంగా ఎందరో చనిపోతున్నారని టీడీపీ గత కొన్నాళ్లుగా మొత్తుకుంటున్నదని అన్నారు. జే బ్రాండ్లపై ఆధారాలతో పాటు నిరూపించినా చర్యలు లేవని విచారం వ్యక్తం చేశారు.