శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరం పట్టణంలో అధికార వైసీపీ-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ నాయకులకు తలపగలడంతో వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎమ్మెల్యే ఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, బీజేపీ నేత వరదాపురం సూరి వర్గాల మధ్య గత కొంతకాలంగా ఘర్షణలు ఉన్నాయి. ఇటీవలి వైసీపీ ప్లీనరీ సందర్భంగా వరదాపురం సూరిపై ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీ నాయకులు స్థానిక ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ప్రెస్క్లబ్లో బీజేపీ నేతలు మాట్లాడుతుండగా.. వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. స్కార్పియో వాహనాల్లో వచ్చిన వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గత కొంతకాలంగా వరదాపురం సూరి, ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గీయుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. అది కాస్తా శృతి మించడంతో ఇవాళ భౌతిక దాడిగా మారింది. బీజేపీని ఎదుర్కోవడం చేతగాని ఎమ్మెల్యే కేతిరెడ్డి.. ఇలా తన రౌడీలతో దాడులు చేయించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వరదాపురం సూరి అంటున్నారు. కేతిరెడ్డికి దమ్ముంటే తనను నేరుగా ఢీకొనాలని సూరి సవాల్ విసిరారు.