విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘బిజిలీ మహోత్సవాలు’ ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నది. ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్యత్–పవర్@2047’ పేరుతో వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమం ఆదివారం నుంచి ఏపీలో మొదలైంది. ఈ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52 కేంద్రాల్లో ( జిల్లాకు రెండు కేంద్రాల చొప్పున) నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
జూలై 30న ‘బిజిలీ మహోత్సవ్’ ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ లబ్ధిదారులతో సంభాషిస్తారు. దేశంలో ఇంధన భద్రత కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న వివిధ సంస్కరణలు, కార్యక్రమాలను ప్రదర్శించడానికి వేదికగా ఈ ఉత్సవాలు నిలువనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ సంస్కరణలను ప్రజలకు వివరించేందుకు ఈ ఉత్సవాల వేదికను ఉపయోగించుకునేందుకు బీజేపీ నాయకులు కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తున్నది.
గృహ విద్యుదీకరణ, వన్ నేషన్-వన్ గ్రిడ్ ఇతివృత్తాలపై ఆడియో-విజువల్ మీడియా, నాటకాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇన్ఫోగ్రాఫిక్స్ ప్రదర్శన, లఘు చిత్రాల ప్రదర్శన వంటి వాటి ద్వారా సాధారణ ప్రజలకు అవగాహన తీసుకురానున్నారు. వినియోగదారుల హక్కులు, పునరుత్పాదక ఇంధనం, సామర్థ్య జోడింపు, విజన్ పవర్@2047కి అనుగుణంగా సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా ఈ ఉత్సవాల్లో పాల్గొనేవారి అభిప్రాయాలను సేకరించి ఆ మేరకు కార్యాచరణ చేపట్టడం ఈ ఉత్సవాల ముఖ్యోద్దేశం అని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.