వెలగపూడి: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాటా చౌర్యానికి కుట్ర జరిగింది నిజమే అని ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ నిర్ధారించినట్లు ఆ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు. 2016-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద కుట్ర జరిగిందని చెప్పారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో డాటా చౌర్యం, పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై విచారణకు ఏర్పాటు చేసిన శాసనమండలి సబ్ కమిటీ సమావేశమైంది. చంద్రబాబు ప్రభుత్వం డాటా చౌర్యానికి పాల్పడినట్లు అసెంబ్లీ హౌస్ కమిటీ నిర్ధారించిందన్నారు. హోం, ఐటీ శాఖల అధికారులతో నాలుగురోజుల పాటు చర్చించిన తర్వాత ఈ విషయం తెలిసిందన్నారు.
రాజ్యాంగంలోని వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని భూమన విమర్శించారు. ఇది ప్రజల భద్రతకు కూడా ప్రమాదకరంగా మారిందని అన్నారు. డాటా చౌర్యం చేసి దాదాపు 40 లక్షల ఓట్లు తొలగించారని, అవి వైసీపీకి అనుకూల ఓట్లు అని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను మాత్రమే నిలుపుకుని.. వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలు ప్రయత్నించాయన్నారు. గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, ప్రజల వ్యక్తిగత డాటాను దొంగిలించి తప్పుడు మార్గంలో రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. సేవా మిత్ర యాప్ ద్వారానే డాటా చోరీ జరిగిందని తెలిపారు.
ఈ డాటా చౌర్యంలో ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అప్పట్లో డాటా చౌర్యం పై వైసీపీ రచ్చ చేయడంతో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందని, అయితే అప్పట్లో సిట్ నామమాత్రంగా పనిచేసిందని ఆయన తెలిపారు. పెగాసస్, డాటా చౌర్యంపై హౌస్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో సబ్కమిటీ సభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి, మద్దాల గిరి, మొండితోక జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.