అమరావతి : సినీనటుడు చిరంజీవి నటించిన భోళా శంకర్ (Bhola Shankar ) సినిమా విడుదలపై నెలకొన్న ఉత్కంఠ వీడింది . ఏపీలో రేపు యథాతథంగా సినిమా విడుదల కానుంది. ఏపీలో సినిమా విడుదలపై అభిమానుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. డిస్ట్రిబూటర్ సత్యనారాయణ సినిమా నిర్మాతపై సిటీ సివిల్ కోర్టు (City Civil Court ) లో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు పిటిషన్ను కొట్టివేసింది.
దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ‘భోళా శంకర్’ ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమయంలో నటుడు చిరంజీవి (Chiranjeevi) వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకల్లో చేసిన కామెంట్లు వివాదస్పదంగా మారాయి. ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల ఫంక్షన్లో ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి.
ఏపీ మంత్రులు సహా నేతలంతా మూకుమ్మడిగా చిరంజీవిపై విమర్శల దాడి చేశారు. పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి వ్యాఖ్యల పూర్తి వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోను బట్టి చూస్తే ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అనే మాటకు ముందు చిరంజీవి చాలా మాట్లాడినా ఇదొక్కటే హైలైట్ కావడంతో వివాదాదాస్పదమైంది.