అమరావతి : “దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నది. ఈనేపథ్యంలో ప్రజలు అప్రమత్తమ వ్వాల్సిన అవసరంఎంతైనా ఉందని” జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కరోనా బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సమాచారం మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో నిన్న ఒక్క రోజే లక్ష 80 వేల మందికి కరోనా సోకినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అంతకు ముందు రోజు ఆ సంఖ్య లక్ష 59 వేలుగా ఉందంటే మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని అందరూ గమనించాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో 12వందలకు పైగా,తెలంగాణలో 15వందలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిసిందన్నారు పవన్.
“ముఖ్యంగా జన సైనికులకు నా విన్నపం… మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కరోనాతో ఆపదలో ఉన్నవారిని ఎప్పటిలాగే ఆదుకోండి. ఈ క్రమంలో మీరు సైతం అత్యంత జాగ్రత్తలు పాటించండి”అని పవన్ కళ్యాణ్ కోరారు.”కరోనా సెకండ్ వేవ్ లో మందులు, ఆక్సిజన్ దొరకక ప్రజలు అల్లాడిపోయారు. ఎందరినో ఆ సమయంలో మనం కోల్పోయాం. ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవలసిందిగా తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలను కోరుతున్నాను. ప్రభుత్వాలు తక్షణమే అప్రమత్తం కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను” అని పవన్ అన్నారు.