అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం ప్రజల భవిష్యత్ను అంధకారంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలతో చర్చించి ఖరారు చేసినట్లు తెలిసింది.
రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఉల్లంఘనలను ప్రస్తావించాలని పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలను ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవాలని పార్లమెంటు సభ్యులను కోరారు. వైసీపీకి 28 ఎంపీలు ఉండి ఈ రెండున్నరేండ్లలో ఏం సాధించారు? రాష్ట్రానికి ఏం తెచ్చారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక సమస్యలుంటే హడావిడిగా కొత్త జిల్లాల ప్రతిపాదనను తెచ్చారని చంద్రబాబు మండిపడ్డారు.