Srisailam | శ్రీశైలం : క్షేత్రానికి వచ్చే యాత్రికులకు పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే కాకుండా.. శుభ్రత విషయంలో అవసరమైన ప్రమాణాలు పాటించాలని నంద్యాల జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారి షేక్ ఖాశీంవలి సూచించారు. క్షేత్రపరిధిలోని ప్రధాన హోటళ్ల మేనేజర్లు, సూపర్వైజర్లు, తోపుడుబండి వ్యాపారులతోపాటు సుమారు 25 మంది సత్ర నిర్వాహకులకు ఫుడ్సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ (FOSTAC) FSSAI ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
వ్యాపారులకు శుభ్రత పరిశుభ్రత, ఆహార పరిరక్షణ, వ్యాపార నిర్వహణ విధానం, కిచన్ అండ్ డైనింగ్ మేయింటెనెన్స్ తదితర కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఆహార భద్రత – పరిశుభ్రతలో భాగంగా యాత్రికులు వచ్చివెళ్లే ప్రధాన కూడళ్లలోని హోటళ్లు, అన్న సత్ర సంఘాలవారు వంటశాల, భోజనశాలల్లో పెస్ట్ కంట్రోల్ తప్పనిసరిగా ఉపయోగించాలని FOSTAC సంస్థకు చెందిన చాగంటి ఆంజనేయులు సూచించారు. బొద్దింకలు, బల్లులు, చీమలు, దోమలు, ఈగలు, చెదలు వంటి కీటకాలు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆహార పరిరక్షణ సులభమవుతుందని తెలిపారు.