అమరావతి : విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. అత్తను వెంటాడి నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపిన అల్లుడు ఘటన సంచలనం సృష్టించింది. విజయవాడలోని చనమోలు వెంకట్రావు వంతెనపై జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.నాగమణి, గురుస్వామిల కూతురుని కుంబా రాజేశ్ అనే యువకుడికి వచ్చి వివాహం చేశారు. కొన్ని రోజుల తరువాత అల్లుడు వేధింపులకు గురి చేస్తుండడంతో కూతురును కాపురానికి పంపించకుండా ఇంటిలోనే ఉంచుకుంటున్నారు.
భార్యను కాపురానికి పంపకుండా వేధిస్తున్నారని, విడాకుల కోసం కోర్టులో కేసు వేశారనే కక్షలతో అల్లుడు రాజేశ్ ఆదివారం విజయవాడలో అత్త నాగమణి, మామ గురుస్వామిపై వెంటపడి వెంకట్రావు వంతెన దొరకపట్టుకున్నాడు. నడిరోడ్డుపై ముందుగా అత్తపై దాడిచేసి నరికి చంపగా మామ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.