అమరావతి: ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక రేపు( గురువారం) జరుగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 279 పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు 1132 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీంగ్ను నిర్వహించనున్నారు. ఇవాళ ఎన్నికల సిబ్బంది సామగ్రీతో పోలీంగ్ కేంద్రాలకు బయలు దేరారు. పోలీంగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. మూడు కంపెనీల కేంద్ర పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి.
ప్రస్తుతం 14 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అధికార వైసీపీ తరఫున మేకపాటి గౌతం రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి, బీజేపీ తరఫున భరత్కుమార్ ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు పోటీకి దూరంగా ఉంటున్నాయి. మొత్తం రెండు లక్షల 13 వేల338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.