అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ వారి సన్నిధిలో ఆషాఢమాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.కనకదుర్గ నగర్లోని గోశాల వద్ద నుంచి తీసుకువచ్చిన సారెను మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలతో అమ్మవారికి ఆలయ అర్చకులు సమర్పించారు. ప్రతి ఏడాది ఆషాఢమాసంలో వచ్చే వారాహీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి సారెను సమర్పించారు.
ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో నిర్వహించే పవిత్ర సారె మొదలుకొని, తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమిటీ దుర్గమ్మ సన్నిధికి తీసుకొచ్చే బంగారు బోనం సమర్పణ, ఆ తర్వాత శాకంబరీదేవి ఉత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది భక్తుల రద్దీ పెరుగుతుందనే అంచనాతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ నెల 30 నుంచి జులై 28 వరకు పవిత్ర ఆషాఢ సారె కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఆంక్షల మధ్య కొనసాగిన కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో వేడుకలను నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని ధార్మిక సంస్థలు, భజన మండళ్లకు సమాచారం పంపారు. సారె సమర్పణకు బృందాలుగా తరలివచ్చే వారంతా మూడు రోజుల ముందు శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.