తిరుపతి : టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలని జేఈవో సదా భార్గవి( JEO Sadabhargavi) కోరారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 31వ వార్షికోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఈవో హాజరై మాట్లాడారు. నీట్, ఎంసెట్, లాసెట్, సీఎ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కోచింగ్ వసతి కల్పిస్తామన్నారు. ఈ సంవత్సరం వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు.
భక్తుల కానుకల ద్వారా టీటీడీ (TTD) కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణ, ఏకాగ్రతతో విద్యాబుద్ధులు నేర్చుకోవాలన్నారు. కళాశాలలో నిర్వహించే మెంటార్ షిప్, ప్రేరణ లాంటి కార్యక్రమాలను వినియోగించుకోవాలని తెలిపారు. విద్యార్థినులకు నెలకోసారి తిరుమల స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.
విద్యార్థినులు చదువుతోపాటు తమకు నచ్చిన రంగంలో రాణించేందుకు సాధన చేయాలన్నారు. టీటీడీ న్యాయాధికారి వై. వీర్రాజు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులది సందిగ్ధ వయసని , అనేక ప్రభావాలు ఉంటాయని, అధ్యాపకులు, తల్లిదండ్రుల సలహాలను తప్పక పాటించాలని సూచించారు. కళాశాలలో చేరిన మొదటి రోజే దృఢమైన ఆశయం ఏర్పరచుకోవాలని కోరారు.