తిరుమల : లోక కల్యాణార్థం తిరుమల వసంత మండపంలో టీటీడీ నిర్వహించనున్న అరణ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా సంకల్పం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విక్వరణం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్ట, అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్బంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్.అవధాని మాట్లాడుతూ శ్రీరాముడు పితృవాక్య పరిపాలన కోసం అరణ్యవాసం చేస్తూ రాక్షసులను సంహరించి, తపస్సు చేసుకునే ఋషులకు రక్షణ కల్పించాడని తెలిపారు. అరణ్యకాండలోని 75 సర్గల్లో 2,454 శ్లోకాలు ఉన్నాయన్నారు.
ఈ శ్లోకపారాయణ ద్వారా రాక్షస గుణాలు తొలగిపోయి సాత్విక గుణాలు అలవడతాయని అన్నారు. తిరుమలలోని వసంత మండపంలో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుంచి 16 మంది వేద, శాస్త్ర పండితులతో పారాయణదీక్ష చేపడతారని చెప్పారు.
మరో 16 మంది పండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో జప, తర్పణ, హోమాదులు ప్రతి శ్లోకానికీ నిర్వహిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఈవో ఎవి.ధర్మారెడ్డి, వేద పాఠశాల అధ్యాపకులు, వేద పండితులు పాల్గొన్నారు.