అమరావతి : పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశారన్న ఆరోపణల మేరకు శిక్షపడ్డ అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు రోజుల క్రితం సీబీఐ కోర్టు కొత్తపల్లి గీత, భర్త రామకోటేశ్వరావుతో పాటు ముగ్గురు బ్యాంక్ అధికారులకు ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. భార్య,భర్తను అరెస్టు చేసిన సీబీఐ కోర్టు జైలుకు తరలించింది.
విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి గీత దంపతులు రూ.52 కోట్ల లోన్ తీసుకున్నారు. బ్యాంకుకు తప్పుడు వివరాలను అందించారని, బ్యాంకును మోసం చేశారని ఆరోపిస్తూ సీబీఐ 2015 జూన్ 30న కొత్తపల్లి గీత, ఆమె భర్త, మరో ముగ్గురుపై చార్జిషీట్ దాఖలు చేసింది. కొత్తపల్లి గీత తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా వారికి బెయిల్ మంజూరు చేసింది. రూ. 25వేల వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.