విజయవాడ: ప్రయాణికులను ఆకర్శించేందుకు కొత్త ప్రణాళికలను రచిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ). చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా.. పండగ రోజుల్లో ప్రయాణికులను నిలువునా దోచుకున్న ఏపీఎస్ ఆర్టీసీ.. ఇప్పుడు అదే ప్రయాణికుల మెప్పు పొందే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నది. పండగ సీజన్లో సీటు దొరకడమే కష్టంగా మారిన వేళ.. ఇప్పుడు రిబేట్ ఇస్తాం రండి అంటూ వేడుకొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వారికి టికెట్ రేట్లో 20 శాతం మేర రిబేట్ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల ఆదరణ పొందేందుకు కృష్ణాజిల్లా ఆర్టీసీ అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ మాదిరి ఆఫర్లను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కృష్ణాజిల్లా – హైదరాబాద్ మధ్య రాకపోకల కోసం ప్రయాణికుల ఛార్జీలను తగ్గించాలని నిర్ణయించారు. కృష్ణాజిల్లాకు చెందిన అన్ని రకాల ఏసీ బస్సుల్లో 20 శాతం ఛార్జీలు తగ్గించనున్నారు. ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ బస్సుల్లో ఛార్జీలను 20 శాతం వరకూ తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
ఆదివారం మినహా మిగతా రోజుల్లో కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సుల్లో తగ్గించిన ఛార్జులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ తెలిపింది. అలాగే శుక్రవారం మినహా.. మిగిలిన రోజుల్లో హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చేవారికి కూడా ఇదే మాదిరి డిస్కౌంట్ ఛార్జీలు అమలవుతాయని తెలిపింది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, ఆటోనగర్ డిపోల బస్సుల్లో హైదరాబాద్ వెళ్లేవారికి ఈ రాయితీ వర్తించనున్నది.