AP Weather | ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. మరికొన్ని చోట్ల ఎండల ప్రభావంతో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇవాళ, రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఒకవైపు వర్షాలు, పిడుగుపాటులు ఉండగా.. మరోవైపు వడగాలుల హెచ్చరికలను కూడా ఏపీఎస్డీఎంఏ జారీ చేసింది. పోలవరం జిల్లాలోని చింతూరు, ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 66 మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మన్యం జిల్లాలోని వీరఘట్టం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరుపాలెంలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు.