విజయవాడ రెవెన్యూ భవన్లో పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. రేపటి ఛలో విజయవాడ కార్యక్రమంపై ఉద్యోగ సంఘాల నేతలు చర్చిస్తున్నారు. బీఆర్టీఎస్ రోడ్డులో సభ జరిపేందుకు ఉద్యోగ సంఘాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించడంపై కూడా పీఆర్సీ సాధన సమితి కమిటీ చర్చిస్తున్నది. హైకోర్టును ఆశ్రయించడంపై న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలుస్తున్నది.
ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తేవడానికి పీఆర్సీ సాధన సమితి కమిటీ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై చర్చించేందుకు రెవెన్యూ భవన్లో అత్యవసరంగా భేటీ అయ్యారు. కొత్త పీఆర్సీని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు జరపకుండా చూసేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఉద్యోగులు నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టిన ఉద్యోగులు, చివరగా ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్లను సాధించుకోవాలని ఉద్యోగ సంఘాలు కృతనిశ్చయంతో ఉన్నాయి.
మంత్రుల కమిటీతో ఉద్యోగులు మంగళవారం జరిపిన సంప్రదింపులు కొలిక్కి రాలేదు. కొత్త పీఆర్సీ ప్రకారం ఇచ్చిన జీతాలపై నిరసన వ్యక్తం చేస్తూ పే స్లిప్పులను కాల్చివేశారు. చర్చలు విఫలం కావడంతో యధావిధిగా ఛలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టేందుకు పీఆర్సీ సాధన సమితి కమిటీ ముందుకొచ్చింది. అయితే, కొవిడ్ మార్గదర్శకాలు అమలులో ఉన్నందున ఉద్యోగులు జరపతలపెట్టిన సభకు అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఉద్యోగ సంఘాల నేతలను కట్టడి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో హౌజ్ అరెస్టులు కూడా చేపడుతున్నారు. ఛలో విజయవాడకు హాజరుకావద్దంటూ పలువురు నేతలకు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. వీటన్నింటిపై పీఆర్సీ సాధన సమితి కమిటీ చర్చించి.. భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.