Kodali Nani on Babu | టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తాడేపల్లిలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఓ 420 అని షాకింగ్ కామెంట్ చేశారు. చంద్రబాబుకు కుట్రలు పన్నడం వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు.
ఎవరైనా భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా? అని కొడాలి నాని నిలదీశారు. ఆయనకు మహిళల ఉసురు తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. ఎవరి పాపాన వాళ్లే పోతారన్నారు. గంటలు గంటలు మీటింగ్లు పెట్టుకుని సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డిని అరాచక పాలన సాగిస్తున్నారంటూ దుర్భాషలాడతారా? అని కొడాలి నాని మండి పడ్డారు. జగన్ పాలనలో అరాచకమేముందన్నారు.
ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా.. విడి పోయిన తర్వాత అర్ధరాజ్యానికి.. విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. సమీప భవిష్యత్లో ప్రతిపక్ష హోదా కూడా పోతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్ ఎయిర్పోర్టు తానే కట్టానంటున్నారు.. ఆయన కట్టారా? అని చాలెంజ్ చేశారు. దానికి శంకుస్థాపన చేసింది చంద్రబాబైతే.. ప్రారంభించింది అప్పటి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి.. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అని గుర్తు చేశారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించింది వైఎస్ రాజశేఖర్రెడ్డి అని కొడాలి నాని చెప్పారు. హైదరాబాద్-విజయవాడ ఫోర్లైన్ రోడ్డుకు ఉమ్మడి ఏపీ సీఎం రోశయ్య శంకుస్థాపన చేస్తే ఆయన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పూర్తయిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్నీ తానే అంటున్న చంద్రబాబు.. రాజకీయాలు పక్కనబెడితే ఆయనతో ఎక్కడైనా చర్చలకు సిద్ధమా అని సవాల్ చేశారు.
విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిని తానే సృష్టించానని చంద్రబాబు చెబుతున్నారని, కానీ అసలు అమరావతిలో ఏం ఉందని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతిలో గ్రాఫిక్స్ చూపారు తప్ప సాధించిన ఘనతేం లేదన్నారు. అమరావతిలో అసలు అమరావతి ఉందా? అని నిలదీశారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీకి ఏమైనా సలహాదారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. ఆయన సలహాలు తమ పార్టీకి ఏమీ అవసరం లేదని స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షుడిగా ఆయన పని ఆయన చేసుకోవాలన్నారు.