అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంపై కొందరు నాయకులు దుష్ప్రచారాలు చేస్తూ ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వారు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకుడు చంద్రబాబుకు క్రెడిబిలిటీ, పవన్ కల్యాణ్కు క్యారెక్టర్ లేదని ఆరోపించారు.
సీసీఆర్సీ కార్డు, పాస్బుక్ ఉన్న రైతులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాకు ప్రభుత్వం రూ. 7 లక్షలు ఇస్తుందని తెలిపారు. టీడీపీ హయాంలో సవాలక్ష నిబంధలు పెట్టి కొంతమందికి మాత్రమే పరిహారం ఇచ్చేవారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో 471 మంది రైతులకు ఇవ్వని పరిహారాన్ని వైసీపీ అందించిందని వివరించారు.
రాష్ట్రంలో ఎక్కడా కూడా క్రాప్ హాలిడే ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. వైసీపీ ప్లీనరీ విజయవంతం కావడంతో ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు.