YS Jagan | అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదని.. తమకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే ప్రజా సమస్యలను వినిపించే అవకాశం ఉంటుందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్ రాసిన లేఖపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. ప్రతిపక్షహోదా గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని మండిపడ్డారు.
ప్రమాణస్వీకారం రోజు ఆయన పేరే ఆయన మరిచిపోయారని జగన్ను గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. వైసీపీ సభ్యులు ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా జగన్ సభలో లేరని విమర్శించారు. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్ సభలో లేరన్నారు. స్వీకర్కు జగన్ గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైసీపీ నేతలు మాట్లాడే అర్హత కోల్పోయారని పేర్కొన్నారు.
మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని వైఎస్ జగన్ అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని.. ముందే నిర్ణయించినట్లు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని తెలిపారు. అటు పార్లమెంటులో గానీ.. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గానీ ఈ నిబంధనను ఇప్పటిదాకా ఎప్పుడూ పాటించలేదని గుర్తుచేశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం, స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని జగన్ వాపోయారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు ఇటీవల బయటపడ్డాయని తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలను వినిపించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ అంశాలను స్పీకర్ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.