అమరావతి : ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి అంబటి రాంబాబు (AP Minister Ambati) వ్యంగ్యస్త్రాలు గుప్పించారు. ఒకరితో ఉంటూ మరొకరితో రహస్య సంబంధాలు పెట్టుకోవడం పవన్ జీవితంలో సహజమేనని ఆరోపించారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన సభలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు మాట్లాడిన తీరుపై విమర్శలు గుప్పించారు.
రాబోయే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని వ్యాఖ్యనించడంపై స్పందించారు. రెండు పార్టీలు ఎప్పుడు విడిపోయాయయని అనుమానం వ్యక్తంచేశారు. ‘ జనసేన (Jana Sena) పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసే పనిచేశాయి కదా కొత్తగా కలిసి పోటీ చేస్తామని చెప్పడంలో వింత ఏముందని ’ ప్రశ్నించారు. 2014లో రెండు పార్టీలు కలిసి పనిచేశాయి. 2019లో వైసీపీని ఓడించడానికి విడివిడిగా పనిచేశాయని పేర్కొన్నారు.
విజయనగరంలో నిర్వహించిన సభ విఫలమయిందని అన్నారు. నారా లోకేశ్ పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల సమస్యలు చెప్పకుండా అధికార వైసీపీపై బురద చల్లే ప్రయత్నాలు చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.