Pinnelli | ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జూన్ ఆరో తేదీ వరకూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. పోలింగ్ నాడు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి గురువారం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. పిన్నెల్లితోపాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై పోలీసుల దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయొద్దని పిటిషనర్లను ఆదేశించింది.
ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. రెంట చింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల్లోని 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
పిన్నెల్లిపై ఐపీసీలోని 143, 147, 448, 353, 452, 120బీ, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పిన్నెల్లి విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారిన అనుమానించిన పోలీసులు.. దేశంలోని అన్ని విమానాశ్రయాలకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. పల్నాడు ఎస్పీ సారధ్యంలో ఎనిమిది పోలీసు బృందాలు గాలింపు చేపట్టడంతో పిన్నెల్లి గురువారం హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.