హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) ప్రభుత్వ ఉపాధ్యాయులకు (Government Teachers) ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్లోనూ (Summer Holidays) అదనపు పనులు అప్పగించింది. సెలవుల్లో విద్యార్థుల నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించింది. విద్యార్థులకు గ్రం థాలయాల నిర్వహణపై అవగాహన, ఆన్లైన్ తరగతులు, వెబినార్లు నిర్వహించాలని సూచించింది. సృజనాత్మకత పెంచేందుకు ప్రాజెక్టులు, క్రీడలు, డ్యాన్స్, యోగా వంటి అంశాల్లో పాల్గొనేలా చూడాలని, ఈ కార్యకలాపాలను పాఠశాల విద్య వెబ్సైట్లో లేదా ఆ శాఖ సోషల్ మీడియాలో ప్రదర్శించాలని పేర్కొన్నది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులందరికీ షెడ్యూల్ విడుదల చేసింది.
టీచర్లంతా వారి తరగతుల విద్యార్థులతో వేర్వేరుగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, వేసవి సెలవుల్లో విద్యార్థులు ఒక నోట్బుక్ నిర్వహించేలా చూడాలని తెలిపింది. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఆయా కార్యక్రమాలపై నివేదికలు రూపొందించాలని సూచించింది. ఈ షెడ్యూల్లో టీచర్లందరూ పాఠశాలలకు రావాలా? వద్దా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ఇచ్చిన టాస్క్ను పూర్తిచేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులకు వేసవి సెలవులు ఇస్తున్నందున ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్జిత సెలవులు (ఈఎల్స్) 30 ఇవ్వడం లేదని, కేవలం ఆరు మాత్రమే ఇస్తున్నారని గుర్తుచేస్తున్నారు. వేసవి సెలవుల్లో ఇలాంటి పనులు అప్పగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులను కూడా నాన్-వెకేషన్ ఉద్యోగుల జాబితాలో చేర్చి.. 30 ఈఎల్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.