అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. 20 వ తేదీ నుంచి వారం పాటు ఈ సమావేశాలు జరిపేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మార్పు కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేయనున్నారని, కొత్త డిప్యూటీగా కోలగట్ల వీరభద్ర స్వామి ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరో రెండు మూడు రోజుల్లో ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్, సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చించినట్లుగా తెలిసింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటన వివరాలు, తదితర అంశాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. కోనసీమలో జరుగుతున్న ఆందోళనలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై గవర్నర్కు సీఎం జగన్ వివరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.