ఇప్పటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసింది కాదని, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని విజయ పథం వైపు నడిపించడానికే కొందరిని కేబినెట్ నుంచి తప్పించి, పార్టీ బాధ్యతల్లోకి పంపించాల్సి వచ్చిందని సజ్జల వివరణ ఇచ్చారు. ప్రతి ఎమ్మెల్యేపై కూడా సీఎం జగన్కు ప్రత్యేకమైన వాత్సాల్యమే ఉంటుందని, ఎవరిపై ఎక్కువ, తక్కువ అంటూ ఉండదని అన్నారు. రాగద్వేషాలకు అతీతంగానే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగిందని సజ్జల పేర్కొన్నారు. అయితే.. వారి వారి అభిరుచుల ప్రకారం కొందరికి కొన్ని పదవులు దక్కాయని, మరి కొందరి విషయంలో సీఎం జగన్ ఛాయిస్ ప్రకారం పదవులు దక్కాయని వివరించారు.
వెనుకబడిన వర్గాల వారికి ప్రాధాన్యత పెంచడం, ప్రాంతాల వారీగా సమతుల్యత పాటించడం, ఆయా కులాల విషయంలోనూ ఎవ్వరినీ నిర్లక్ష్యం చేయలేదని, అంతా సమానంగా చేశామని అన్నారు. ఈ పునర్ వ్యవస్థీకరణ విషయంలో ఎవరైనా రంధ్రాన్వేషణ చేస్తే వారే ఫూల్స్ అవుతారని సజ్జల స్పష్టం చేశారు. మొదటి నుంచి కూడా సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీతో పాటు మైనారిటీలకు పెద్ద పీట వేస్తున్నారని గుర్తు చేశారు. పేదలకు తాయిలాలు మాత్రమే కాకుండా పాలనలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. బీసీలంటే బ్యాక్వర్డ్ కాదని, బ్యాక్ బోన్ అని ఆయన అభివర్ణించారు. ఇప్పటి వరకూ కేబినెట్లో ముగ్గురు మహిళలుండగా… ఇప్పుడు నలుగురికి అవకాశం ఇచ్చామని సజ్జల ప్రకటించారు. ఈసారి 25 మందిలో 70 శాతం బడుగు బలహీనవర్గాల వారేనని తెలిపారు. తొలి కేబినెట్లో 14 మంది బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చామని గుర్తు చేశారు.
అయితే కేబినెట్లో ఛాన్స్ మిస్సైన వారికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సీఎం జగన్ చూపారని సజ్జల తెలిపారు. వీరభద్ర స్వామిని డిప్యూటీ స్పీకర్గా తీసుకున్నామని, అలాగే చీఫ్ విప్గా ప్రసాద రాజు గారిని, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎమ్మెల్యే విష్ణును తీసుకున్నామని, స్టేట్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా కొడాలి నానిని నియమించామని… ఇలా అటు కులాల వారిగా, పదవుల విషయంలోనూ సమతుల్యత పాటించామని సజ్జల తెలిపారు. ఇలా చేయడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారని అన్నారు.
కేబినెట్ కూర్పుపై ఎవ్వరికీ అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ఇదంతా మీడియా సృష్టేనని సజ్జల మండిపడ్డారు. అయితే.. ఎవరైనా కేబినెట్ బెర్త్పై సహజంగా ఆశలు పెట్టుకొని, రాకపోతే.. వారు ఫీల్ అయిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అంతమాత్రాన వారందరూ రాజకీయంగా అసంతృప్తితో రగిలిపోతున్నారన్న దానిలో మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ దృష్టిలో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం రెండూ రెండు కళ్లలాంటివని అన్నారు. అటు పార్టీ బాధ్యతలు కూడా బాధ్యతేనని, ఇటు కేబినెట్ పదవి కూడా బాధ్యతతో కూడినదేనని తెలిపారు.