ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వెళ్లారు. మంత్రి పదవుల జాబితాలో బాలినేని పేరు మిస్సైంది. దీంతో ఆయన అలక వహించారు. ఆయన్ను బుజ్జగించడానికి సజ్జల రంగంలోకి దిగి, ఆయన నివాసానికి వెళ్లి, చర్చలు జరుపుతున్నారు. విచిత్రం ఏమిటంటే..ఈ ఒక్క రోజులోనే సజ్జల మాజీ మంత్రి బాలినేని నివాసానికి రెండు సార్లు వెళ్లడం.
కేబినెట్లో తన పేరు మిస్సవ్వడంతో మాజీ మంత్రి బాలినేని తీవ్ర అసంతృప్తికి లోనైన నేపథ్యంలో మధ్యాహ్నం కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి బాలినేని నివాసానికి వెళ్లారు. ఆయనను బుజ్జగించారు. అయితే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేశ్ను మంత్రివర్గంలోకి తీసుకొని, తనను తీసుకోకపోవడం ఏంటని సజ్జలను ప్రశ్నించినట్లు సమాచారం. అయితే మంత్రివర్గంలో బెర్త్ మిస్సైన వారికి నామినేటెడ్ పదవులతో సరి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలినేనికి ఏదైనా నామినేట్ పోస్టు ఇస్తారా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి వుంది.