Water Bells | ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ బెల్స్ మోగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎండ వేడిమి కారణంగా డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రోజులో మూడుసార్లు ఈ వాటర్ బెల్స్ మోగించాలని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఆదేశాల ప్రకారం విద్యార్థులకు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లుగానే 5 నిమిషాల పాటు వాటర్ బ్రేక్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8:45, 10:50, 11:50 గంటలకు ఒకసారి వాటర్ బెల్ మోగించనున్నారు. బెల్ మోగించిన వెంటనే విద్యార్థులు మంచినీళ్లు తాగేలా చూడాలని విద్యాశాఖ సూచించింది. నిజానికి ఈ వాటర్ బెల్స్ విధానాన్ని 2019లో మొదటిసారిగా కేరళలోని పాఠశాలలు ప్రారంభించాయి. దీనికి విశేష స్పందన రావడంతో వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల్లోనూ దీన్ని అమలుచేస్తున్నారు.