అమరావతి : ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీతో పాటు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆందోళనలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఈరోజు విజయవాడలో ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పీఆర్సీ కాపీలను దగ్ధం చేశారు. సచివాలయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని అన్నారు. హెచ్ఆర్ఏపై చర్చించ కుండా నిర్ణయం తీసుకోవడం బాధకరం ఆయన పేర్కొన్నారు. కేంద్ర పీఆర్సీ కంటే నష్టంజరిగేలా ఉత్తర్వులిచ్చారని ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల ఆలోచనలకు అనుగుణంగా జీవోను రూపొందించాలని, ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా సీఎం చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. పీఆర్సీ జీవోలను ఉపసంహరించుకోకపోతే ఉద్యోగులంతా చర్చించుకుని ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.