అమరావతి : ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దు చేసే వరకు.. మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లేదని లేదని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడ ఎన్జీవో హోంలో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రుల కమిటీ ఆహ్వానంపై చర్యలకు వెళ్లాలా? లేదా? అనే అంశంపై స్టీరింగ్ కమిటీ నేతలు చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంతో చర్చలు వెళ్లకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని నమ్మి తాము చాలాసార్లు తప్పు చేశామని బొప్పరాజు అన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఉద్యమాన్ని చేయించారని ఆరోపించారు.
ప్రభుత్వం చెప్పిందొకటి.. చేసింది మరొకటని విమర్శించారు. 27 శాతం ఐఆర్ ప్రకటించి.. 23 శాతానికి చేస్తే.. తగ్గించినట్లు కాదా? అని ప్రశ్నించారు. న్యాయబద్ధమైన పోరాటమని ప్రజలు నమ్ముతున్నారని, జీవోలన్నీ విడుదల చేశాక మంత్రుల కమిటీ వేస్తారా? అని ప్రభుత్వాని నిలదీశారు. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పీఆర్సీతో మొదటి జీతం తగ్గే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం పునః సమీక్ష చేసేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు. మునిగినా తేలినా సరే అని సమ్మెకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఉద్యోగుల కడుపు మండేలా జీవోలు తయారు చేశారని, ఇప్పుడు పోరాడకపోతే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారన్నారు. బండి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఉద్యమం విజయవంతమవుతుందన్నారు. ఉద్యోగులు ఎక్కడికక్కడ నిరసన తెలుపారన్నారు. ప్రభుత్వ పెద్దలు తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ ఎక్కువగా ఉండాలని స్పష్టం చేసిన ట్లుచెప్పారు. సీఎం ఇచ్చిన తాయిలాలకు తాము మురిసిపోలేదని, తమపై కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. డిమాండ్లు సాధించుకునేవరకు విరమించే ప్రసక్తే లేదన్నారు.
ఇదిలా ఉండగా.. మరో వైపు ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు మంత్రుల కమిటీ సచివాలయానికి చేరుకుంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, సజ్జల, అధికారులు ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వస్తారని నిరీక్షించారు. అయితే, ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేది లేదని స్పష్టం చేసిన ఉద్యోగ సంఘాల నేతలు.. తమ తరఫున ప్రతినిధులను పంపి, కమిటీకి నిరసన లేఖ ఇచ్చారు. పీఆర్సీ సాధన సమితి తరఫున స్టీరింగ్ కమిటీలోని ఆస్కార్రావు, వైవీరావు, రాజేశ్, హృదయరాజు, శివారెడ్డి లేఖను మంత్రుల కమిటీకి అందజేశారు.