అమరావతి : ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan ) భారీ విరాళాన్ని (Donations) ప్రకటించారు. తెలంగాణకు రూ. కోటిని సీఎంకు స్వయాన అందజేస్తానని తెలిపారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలోని 400 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు తనవంతుగా లక్ష రూపాయల చొప్పున రూ. 4 కోట్లు, ఏపీకి రూ. కోటి అందజేస్తానని ప్రకటించారు.
పంచాయతీ రాజ్ ఉద్యోగులు, ఇంజినీర్లు విరాళం ప్రకటించడం పట్ల అభినందించారు. 2014-19లో వచ్చిన హుదాహుద్ తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులకు రూ. 50 లక్షలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఏపీలో వరదల వల్ల 29 మంది ప్రాణాలు కోల్పోయ్యారని, ఇద్దరు గల్లంతయ్యారని, 200 పశువులు , వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయని తెలిపారు.
131 కేంద్రాల్లో పశువులకు చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 69 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు. 233 కిలోమీటర్ల పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు. వరద ఉదృతి తగ్గిన తరువాత రోడ్లు, కల్వర్ట్లు బాగు చేస్తామన్నారు.