Pawan Kalyan | వైసీసీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు, చేప నూనె కలిపి అపవిత్రం చేసి.. హిందువుల మనోభావాలను దెబ్బతీయడాన్ని నిరసిస్తూ పవన్ కల్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతరా వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వమించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రథాలను తగులబెట్టారని, ఆలయాలను అపవిత్రం చేశారని ఆరోపించారు. ఏ మతమైనా సరే వారి మనోభావాలు దెబ్బకూడదని పవన్ కల్యాణ్ అన్నారు.
సంస్కరణల పేరుతో 2019 నుంచి వైసీపీ చాలా మార్పులు తీసుకొచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. తిరుమల శ్రీవారి పూజా విధానాలను సైతం మార్చేశారని విమర్శించారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10వేలు వసూలు చేసి.. బిల్లు మాత్రం రూ.500కే ఇచ్చారని మండిపడ్డారు. మహాప్రసాదంగా భావించే శ్రీవారి లడ్డూను కూడా కల్తీ చేశారని తెలిసి ఆవేదన కలుగుతోందని అన్నారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతుందని అస్సలు ఊహించలేదని తెలిపారు. అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. ఇదంతా జరుగుతుంటే వైవీ సుబ్బారెడ్డి, ధర్మా రెడ్డి ఏం చేశారని నిలదీశారు. తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని మండిపడ్డారు. చర్చిలో, మసీదులో ఇలా జరిగితే జగన్ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. హిందూ ధర్మానికి జరిగితే ఎందుకు వెనకేసుకొస్తున్నారని నిలదీశారు.
కోట్ల మంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. వేదన కలిగినప్పుడు పోరాడతామని అన్నారు. ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తామని స్పష్టం చేశారు. పరస్పర మత విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా అవసరమని అన్నారు.