అమరావతి: ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. గత నెల 22న 35 పట్టణాల్లో 997 సెంటర్లలో అభ్యర్థులు క్వాలిఫైయింగ్ టెస్ట్కు పరీక్షలు రాశారు. మొత్తం నాలుగు లక్షల 59 వేల 182 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా వారిలో 95,208 మంది ఉత్తీర్ణులైనట్టు బోర్డు వెల్లడించింది.
పరీక్షా ఫలితాలను slprb.ap.gov.in పొందవచ్చని పేర్కొంది.కాగా గత నెల 22న పరీక్ష ముగిసిన వెంటనే ప్రిలిమినరీ కీ నీ విడుదల చేయగా 2261 అభ్యంతరాలు వచ్చాయని వెల్లడించింది. వాటిని సబ్జెక్ట్ నిపుణులతో చర్చించి అవసరమైన వాటిని పరిగణలోకి తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది.అభ్యర్థుల ఓఎంఆర్ షీట్స్ ఈనెల 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
స్టేజ్ టు ఆన్ లైన్ అప్లికేషన్ దరఖాస్తును ఈ నెల 13వ తేదీ సాయంత్రం మూడు గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటుందని బోర్డు తెలిపింది. అభ్యర్థులు తమ అనుమానాల నివృత్తికి హెల్ప్ లైన్ నెంబర్లు 9441450639, 9100203323కు లేదా slprb@ap.gov.in మెయిల్లో సంప్రదించాలని స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచించింది.