Hyderabad | హైదరాబాద్ నగరం తమకు లేకపోవడం వల్ల పదేండ్లలో రూ.1.30 లక్షల కోట్లు నష్టపోయామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. పవర్ హౌస్ లాంటి నగరం తమకు లేకపోవడం వల్లనే వైజాగ్పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనతో పాటు ప్రత్యేక హోదా, రాజధాని అంశాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లు కలిసికట్టుగా ఉండి హైదరాబాద్ నగరాన్ని నిర్మించుకున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అది ఆర్థికపరంగా ఒక పవర్ హౌస్ లాంటిది అని చెప్పారు. ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలని అన్నారు. ప్రతి రాష్ట్రానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు ఉండాలని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలకు పవర్ హౌస్ లాంటి మహానగరాలు లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవని అన్నారు. హైదరాబాద్ నగరం తమతో లేకపోవడం వల్ల భారీగా ఆదాయం నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు. అందుకే అలాంటి ఓ నగరంగా విశాఖపట్నం మారాలని మాటిమాటికి అంటున్నానని తెలిపారు. వైజాగ్పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామని తెలిపారు.
విభజన కారణంగా హైదరాబాద్ లేకపోవడంతో ఆదాయాల పరంగా ఏటా 13వేల కోట్లు నష్టపోయామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఒకవేళ ఏటా రూ. 13 వేల కోట్లు వచ్చే అవకాశం ఉండి ఉంటే.. దాదాపు పదేండ్లలో 1.30 లక్షల కోట్ల అదనపు ఆదాయం తమ దగ్గర ఉండేదని పేర్కొన్నారు. లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల ఆదాయం ఉండి ఉంటే.. రాష్ట్రంలో ఎన్నెన్నో చేసే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. కానీ అన్యాయంగా ఆ వెసులుబాటును మన దగ్గర నుంచి తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టడమే కాదు.. ప్రత్యేక హోదా అంశాన్ని కనీసం చట్టంలో కూడా చేర్చలేదని అన్నారు. చట్టంలో ఈ విషయాన్ని పేర్కొని ఉంటే కోర్టుకు వెళ్లి అయినా ప్రత్యేక హోదా తెచ్చుకునేవాళ్లమని స్పష్టం చేశారు.
ఇలా రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా.. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకపోవడంతో చాలా నష్టపోవాల్సి వస్తుందని జగన్ అన్నారు. ఈ కారణంగానే మనపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప.. ప్రత్యేక హోదా దక్కడం ఎండమావిగానే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అందుకే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా స్పష్టమైన మెజారిటీ రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. కనీసం మన సపోర్టుపై ఆధారపడే ప్రభుత్వం వస్తే అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కుతుందేమోనని ఆశగా ఉందన్నారు.