తిరుపతి : తిరుపతి సమీపంలోని పేరూరు బండపై పునర్నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో సీఎం ను సన్మానించి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు.
మంత్రి పెద్దిరెడ్డి తన సొంత నిధులతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వకుళ మాత ఆలయం వద్ద 83 ఎకరాల 42 సెంట్ల భూమి ఉందని, ఈ ప్రాంతంలో టీటీడీ కల్యాణ మండపం, అతిధి భవనం నిర్మిస్తుందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. దాదాపు 20 కేజీల బంగారంతో ఆలయ గోపురానికి 5 కలశాలు, విమానానికి ఒక కలశం టీటీడీ సహకారంతో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అంతకుముందు ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎంకు రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, నారాయణస్వామి, రోజా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.