తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలి రోజైన సెప్టెంబర్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మరుసటి రోజు పరకామణి భవనాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని చెప్పారు. శ్రీవారి ఆలయ బంగారు తాపడం విధివిధానాలపై వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 27న రాత్రి 7 గంటలకు సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, అనంతరం రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే పెద్దశేష వాహనసేవలో పాల్గొంటారని ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. మరుసటి రోజు ఉదయం పరకామణి నూతన భవనాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని చెప్పారు. ఆధునిక వసతులతో ఏర్పాటుచేసిన ఈ భవనంలో కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని భక్తులు చూసేందుకు వీలుగా రెండువైపులా అద్దాలు ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి ఆలయం నుంచి హుండీలను బ్యాటరీ కార్ల ద్వారా పరకామణి భవనానికి తరలిస్తారని చెప్పారు. కానుకలు భద్రపరిచేందుకు వీలుగా స్ట్రాంగ్ రూములు నిర్మించినట్లు తెలిపారు. నాణేలను వేరు చేసేందుకు రూ.2.50 కోట్లతో కాయిన్స్ ఆటోమేటిక్ సెగ్రిగేషన్ మిషన్ ఏర్పాటు చేశామన్నారు.
కోర్టు కేసుల పరిష్కారానికి వేగంగా చర్యలు
కాగా, టీటీడీపై కోర్టుల్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని న్యాయ విభాగం అధికారులను ఈఓ ధర్మారెడ్డి కోరారు. తిరుమల అన్నయ్య భవనంలో టీటీడీ న్యాయ విభాగం అధికారులు , స్టాండింగ్ కౌన్సిల్స్తో ఆయన సమావేశమయ్యారు. అక్టోబరు 15వ తేదీలోపు అన్ని కేసుల కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసుకు సంబంధించి విభాగాధిపతులు పూర్తి సమాచారంతో పేరావైజ్ రిమార్క్స్ అందించేలా చూడాలని చెప్పారు. దేవస్థానం న్యాయవిభాగం అధికారులు రెండు నెలలకోసారి స్టాండింగ్ కౌన్సిల్స్తో సమీక్షించి ఎన్నో క్లిష్టమైన కేసుల పరిష్కారానికి మార్గం సూచించాలన్నారు.