అమరావతి : ఏపీలోని ఉత్తర కోస్తాంధ్రకు జవాద్ తుఫాను ముప్పు నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి వీసీలో సీఎస్ డాక్టర్ సమీర్శర్మ పాల్గొన్నారు.
క్యాంప్ కార్యాలయం నుంచి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ డాక్టర్ ఏ రవిశంకర్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి వీ ఉషారాణి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్థిక కార్యదర్శి ఎన్ గుల్జార్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి కే కన్నబాబు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను, ముంపు ప్రాంతాలను గుర్తించి, అక్కడి ప్రజలను ముందే అప్రమత్తం చేయాలని సూచించారు.