హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ మోటార్లు అన్నింటికీ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో, దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానశాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పంపు సెట్లకు మోటార్లు బిగించాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైనట్లు సీఎం జగన్ తెలిపారు. దీంతో దాదాపు 30 శాతం విద్యుత్ ఆదా అయిందన్నారు. కనెక్షన్లు పెరిగినప్పటికీ 33.75 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అయిందన్నారు. రైతులు వాడని కరెంటును ఉచిత విద్యుత్ పేరుతో ఇప్పటి వరకూ లెక్క కడుతున్నామన్నారు. మీటర్ల కారణంగా విద్యుత్ దుర్వినియోగాలకు చెక్ పెట్టి, తద్వారా పారదర్శక వ్యవస్థ ఏర్పడుతుందన్నారు.
మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు నాణ్యమైన కరెంటు అందుతోందన్నారు. విద్యుత్ శాఖ సిబ్బందిలోనూ జవాబుదారీతనం పెరిగిందన్నారు. త్వరలో రాష్ట వ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చాలని ఆదేశించారు. దీనివల్ల అన్ని జిల్లాలో నాణ్యమైన కరెంట్ రావడమే కాకుండా రైతులకు సేవలు మెరుగవుతాయన్నారు. రాజకీయ లబ్ధికోసం మీటర్ల ఏర్పాటు వ్యవహారంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, దీన్ని తిప్పికొట్టి, రైతులకు జరుగుతున్న మేలును వివరించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన్రెడ్డి, సీఎస్ సమీర్శర్మ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాలు ఎఫ్ఏవో ఛాంపియన్ అవార్డుకు ఎంపికైన దష్ట్యా వ్యవసాయశాఖ అధికారులను సీఎం అభినందించారు. అనంతరం రైతు భరోసా, రైతులకు పంట బీమా చెల్లింపు, రాయితీపై రైతులకు వ్యవసాయ ఉపకరణాల పంపిణీ, ఖరీఫ్ సన్నద్ధత కిసాన్ డ్రోన్లు, మిల్లెట్ పాలసీ, పంట మార్పిడి తదితర అంశాలపై సీఎం జగన్ సమగ్రంగా చర్చించారు.