అమరావతి: ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా విశాఖతీరంలో నిర్వహిస్తున్న బహుళ దేశాల నౌకాదళాల విన్యాసం మిలన్-2022లో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి రేపు(ఆదివారం) విశాఖనగరానికి రానున్నారు. శుక్రవారం నాడు ప్రారంభమైన మిలన్ 9 రోజుల పాటు రెండు దశల్లో వేడుకలను నిర్వహిస్తున్నారు. మిలన్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విశాఖ ఆర్కే బీచ్లో రేపు జరుగనుంది. ఏపీ సీఎం ముఖ్య అతిథిగా పాల్గొనే వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ దేశాల నౌకాదళ అధికారులు సహా మొత్తం 5 వేల మంది అతిథులు హాజరవుతున్నారు.
దాదాపు 3 కిలోమీటర్ల మేర జరిగే పరేడ్ను తిలకించేందుకు రెండు లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మిలన్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, రక్షణ రంగ ఉన్నతాధికారులు, వివిధ దేశాలకు చెందిన 150 మంది ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు. నేవీ కవాతుతో పాటు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు జరగనున్నాయి. ఇటీవల నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విశాఖ నౌక, జలాంతర్గామి ఐఎన్ఎస్ లను కేంద్ర, రాష్ట్ర మంత్రులు సందర్శించనున్నారు. అంతర్జాతీయ సాంస్కృతిక బృందాలతో నేవీ నిర్వహించే ఈ పరేడ్ ఆకర్షణీయంగా సాగనుంది.
మిలాన్-2022 నేపథ్యంలో విశాఖ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని విశాఖ పోలీసు కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా తెలిపారు. బీచ్ రోడ్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్కుహోటల్ కూడలి వరకు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని ఆయన వెల్లడించారు.