Chandrababu Naidu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. మరో వైపు కోర్టు తీర్పు వెలువడిన వెంటనే చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్ఎస్జీ భద్రత ఉన్న చంద్రబాబును గృహనిర్బంధంలో ఉంచేందుకు అనుమతించాలని ఒకటి, ఇంటి భోజనం, మందులు ఇచ్చేందుకు మరొక పిటిషన్ వేశారు.
అదే సమయంలో కస్టడీకి కోరుతూ ఏపీ సీఐడీ పిటిషన్ దాఖుల చేసింది. సీఐడీ పిటిషన్పై కౌంటర్ వేయాలని కోర్టు ఆదేశించింది. సీఐడీ కస్టడీ పిటిషన్ రేపు విచారణకు రానున్నది. అదే సమయంలో అరెస్టు, రిమాండ్పై చంద్రబాబు తరఫు న్యాయవాదులు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయనను పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించనున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం జైలు వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలాగే, రాజమహేంద్రవరం జైలుకు కూడా తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.