అమరావతి : ఏపీ సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ డ్రైవ్ను ప్రారంభించారు. నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో 500 ఎల్.పి.ఎం మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏపీ సీఎం జగన్ సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.426 కోట్ల వ్యయంతో 93,600 ఎల్.పి.ఎం సామర్థ్యం గల 144ఆక్సిజన్ ప్లాంట్లతో సహా క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్.ఎం. ఓ ట్యాంకులు, ఆక్సిజన్ పైప్ లైన్లు ఇతర మౌళిక సదుపాయాలను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ” రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి” అన్నారు.
మంచి కార్యక్రమానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సొంతంగా ఆక్సిజన్ ఉత్పాదన చేస్తున్నామని ఆయన చెప్పారు. వంద పడకలు దాటిన 71 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 30 శాతం రాయితీతో నెలకొల్పడం జరుగుతోందని తెలిపారు. రెండవ దశ కోవిడ్ అనుభవం దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
విదేశాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి రెండవ దశలో చూసామన్నారు. నాడు నేడులో ఆసుపత్రుల్లో ఆధునికీకరణ చర్యలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో 39 వేల నియామకాలు వైద్య ఆరోగ్య శాఖలో చేపడుతున్నామని,ఇప్పటికే పలు నియామకాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.