ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ డేర్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామితో పాటు ఎమ్మెల్యే రోజాను కూడా జగన్ తన కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రోజా కల నెరవేరినట్లైంది. అయితే.. చిత్తూరు రాజకీయాలు పెద్దిరెడ్డి వర్సెస్ రోజాగా నడుస్తున్నాయి. ఈ రెండు వర్గాలకూ అస్సలు పడదు. చిత్తూరు జిల్లా రాజకీయాలను పెద్దిరెడ్డి ఒంటి చేత్తో శాసించారు. దీంతో రోజా వర్గీయులు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటిది… రోజాకు కేబినెట్ బెర్త్ దక్కడంపై పెద్దిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు రోజాకు కేబినెట్ బెర్త్ దక్కకుండా మంత్రి పెద్దిరెడ్డి చాలా ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. అయితే.. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తిరుపతి జిల్లా నుంచి రోజాకు సీఎం జగన్ బెర్త్ ఖాయం చేశారు.
చాలా సార్లు ఎమ్మెల్యే రోజా మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైసీపీ నేత కేజే కుమార్ పుట్టిన రోజుకి మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి హాజరయ్యారు. ఈ సమావేశానికి తన అభిమానులు ఎవ్వరూ వెళ్లకూడదని ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. అప్పట్లో ఈ వీడియో టేపులు చిత్తూరు రాజకీయాల్లో కలకలం రేగింది. తనను బహిరంగంగా అవమానపరిచిన వారి కార్యక్రమాలకు వెళ్లొద్దని, ఎవరైనా వెళితే.. వారితో పార్టీకి ఏ మాత్రం సంబంధముండదని రోజా తీవ్రంగానే హెచ్చరించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య సయోధ్య కుదుర్చడానికి సీఎం జగన్ చాలా ప్రయత్నాలు చేశారు.
మొదటి కేబినెట్లోనే రోజా ప్రయత్నాలు
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్ట మొదటి కేబినెట్ కూర్పులోనే ఎమ్మెల్యే రోజాకు కేబినెట్ ఇస్తారని అందరూ భావించారు. కానీ.. చిత్తూరులో ప్రతిపక్ష టీడీపీని ఓడించడంలో ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా శ్రమించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ఈయనకే ప్రాధాన్యమిచ్చారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా అదే జిల్లాకు చెందిన బండి నారాయణ స్వామిని తీసుకున్నారు.
దీంతో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రోజాకు మంత్రి పదవి దక్కలేదు. అప్పట్లోనే రోజా సీఎం జగన్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో జగన్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించి, రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు. విధుల నిర్వహణలో రోజా అయిష్టత వ్యక్తం చేయడంతో ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అప్పటి నుంచి తనకు కేబినెట్లో బెర్త్ కావాలని సీఎం జగన్ ముందు డిమాండ్ పెట్టారు. చివరికి తాజా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో రోజాకు సీఎం కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించారు.