అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఫల్యాల కారణంగా ఏపీ బ్రాండ్ దెబ్బతిట్టుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం వెనుకబడి పోతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కాంట్రాక్టర్లు టెండర్ పనిలో కోర్టుకు వెళ్లే హక్కు లేదంటూ నిబంధన పెట్టడం దారుణమని పేర్కొన్నారు. రూ. 13 కోట్ల పనులకు ధైర్యంగా టెండర్లు పిలవలేని ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుందా అని ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంట్ల నిర్మాణం, మూడు రాజధానులు, ఎయిర్పోర్టులు అన్నీ ఇలాంటి నిబంధనలతోనే చేస్తుందా? అని నిలదీశారు. రాష్ట్రం అభివృద్ధి వైపు కాకుండా అంధకారం వైపు పయనిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం కారణంగా ఆయా సంస్థలు దివాళ తీయడం సమాజంపై ఎంతటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవాలని సూచించారు . కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల టెండర్లో బిల్లుల కోసం ఒత్తిడి తేవొద్దని ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు రాష్ట్ర పరువు తీశాయని ఆందోళన వ్యక్తం చేశారు.