అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఏడో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే జంగారెడ్డి గూడెంపై చర్చకు టీడీపీ సభ్యలు పట్టుబట్టారు. న్యాయ విచారణ జరిపించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం నెలకొన్నది. కార్యకలాపాలకు అడ్డు తగులుతుండటంతో స్పీకర్ తమ్మినేని సీతారాం 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెన్షన్ చేశారు. కాగా, ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే కాపులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
శవ రాజకీయాలు చేయడంలో టీడీపీ దిట్ట అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్ తీసుకున్నదని ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెంలో పరామర్శకు రాజకీయ యాత్రలా వెళ్లడం ఏంటని దుయ్యబట్టారు. గోదావరి పుష్కరాల్లో చనిపోయిన వారి కుటుంబాలను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రతిరోజూ స్పీకర్ చైర్ను కించపరిచేలా ప్రవర్తిస్తున్నదన్నారు.
చనిపోయిన వ్యక్తులకు పార్టీలు, కులాన్ని అంటగట్టి టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. రాయదుర్గానికి చెందిన ఒకరు విత్తనాలు కొనుగోలు చేసి ఇంటికొచ్చి చనిపోతే విత్తన పంపిణీలో చనిపోయాడంటూ టీడీపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు పబ్లిసిటీ నెత్తికెక్కిందని మండిపడ్డారు. తొక్కిసలాటలో 29 మంది చనిపోతే ఆరోజు ఎందుకు పరామర్శించలేదు అని చంద్రబాబును ప్రశ్నించారు.