TTD News | తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో అన్నాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 3 నుంచి 3.30 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, ఉదయం 3.30 నుంచి 5.30 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు. ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. ఉదయం 7.30 నుంచి 8 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపట్టారు.
శుద్ధి అనంతరం ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తోపాటు ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 14 న విశాఖలో కార్తీకదీపోత్సవం
నవంబరు 14 న విశాఖపట్నం బీచ్ రోడ్లో నిర్వహించనున్న కార్తీక మహాదీపోత్సవాన్ని విజయవంతం చేయాలని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి కోరారు. ఈ నేపథ్యంలో ఆమె టీటీడీ అధికారులు, దాతలతో సమావేశమై చర్చించారు. కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు పాసులు ముందుగానే జారీ చేయాలని సూచించారు. తిరుమల నుంచి విశాఖకు వెళ్లే స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను 14 సాయంత్రం ఊరేగింపుగా వేదికకు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని బందోబస్తు చేయాలని చెప్పారు. అతిథుల జాబితాను దాతలు ముందుగానే అందజేయాలని కోరారు.
ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ-2 జగదీశ్వర్రెడ్డి, వీజీఓ మనోహర్, డిప్యుటీ ఈఓలు రమేష్ బాబు, సుబ్రహ్మణ్యం, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ, దాతలు కృష్ణ ప్రసాద్, రాజేష్, హిమాంశుప్రసాద్, మురళి తదితరులు పాల్గొన్నారు.