తిరుమల : తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయాల్లో శుక్రవారం సాయంత్రం ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో దీనికి ఆణివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజైన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుంచే టీటీడీ ఆదాయ వ్యయాలు, నిల్వలు, వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేసి సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ పుండరీక వల్లి అమ్మవారి ఆలయం నుంచి నూతన వస్త్రాలను విమాన ప్రదక్షణగా తీసుకువచ్చి శ్రీ గోవిందరాజస్వామివారికి సమర్పించారు. కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏఈఓ శ్రీ రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ వెంకటాద్రి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ మునీంద్ర బాబు పాల్గొన్నారు.
శ్రీ కోదండరామాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఆలయంలోని గరుడాళ్వార్ ఎదుట శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరాములవారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేకంగా ఆణివార ఆస్థానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ పార్వతి, సూపరింటెండెంట్ రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.