అమరావతి : ఏపీలో రాజకీయాలు, చరిత్ర గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు ఎలాంటి అవగాహన లేదని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని అన్నారు. ఇవాళ కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావడంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయానికి సీఎం నాంది పలికారని ప్రశంసించారు.
40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు కనీసం కుప్పంను రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారని, ఆయన అనుభవం ఏమైందని ప్రశ్నించారు. ఈ అంశాలు పవన్ కల్యాణ్కు ఎందుకు కనిపించటం లేదని పేర్కొన్నారు. కొక్కునూరు ఏలూరు జిల్లాలో ఉంటే కనీస అవగాహన లేకుండా చంద్రబాబు సలహాతో పవన్ కల్యాణ్ లేఖ రాశారని విమర్శించారు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు.