అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం మాదక ద్రవ్యాలకు చిరునామాగా మార్చేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆరోపించారు. నిన్న విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ (Drugs) పట్టుబడడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వం చివరకు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చేసిందని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా ములాలు ఏపీలోనే ఉండడం సిగ్గు చేటని అన్నారు.
ఈ అప్రదిష్టను మోస్తున్న తరుణంలో విశాఖ (Visaka Port) పోర్టులో 25వేల కిలోల డ్రగ్స్ దొరకడం మరింత ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకోవడం వెనుక ఎవరు ఉన్నారో వెంటనే వెలికి తీయాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో డ్రగ్స్ దొరికినప్పుడు కూడా మూలాలు విజయవాడలోని ఒక ప్రముఖ ట్రేడర్దని తేలిందని విమర్శించారు. ఆ సంస్థ వెనుక ఉన్న పెద్దల గురించి కూడా లోతుగా విచారించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ డ్రగ్స్ రాజధానిగా మార్చిందని స్వయాన ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించడం పరిస్థితికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర నిఘా సంస్థలు డ్రగ్స్ రాకెట్ను ఛేదించేందుకు చేపట్టిన ఆపరేషన్ గరుడను మరింత లోతుగా చేసి రాష్ట్రంలోని డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.