వైఎస్ వివేకానంద హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేని వారిని ఇరికించే ప్రయత్నం జరుగుతున్నదని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మీడియాలో వచ్చిన కథనం పూర్తిగా సీబీఐ ఛార్జిషీట్తో తయారుచేశారన్నారు. ఈ కేసు వార్త విషయంలో ప్రభుత్వ సలహాదారుగా కాకుండా.. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నానని చెప్పారు. మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
వివేకానంద కేసుపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, వీరి ఆరోపణలు హేతుబద్దతకు కూడా అందడం లేదని సజ్జల అన్నారు. ఎన్నికలకు ముందు పార్టీనే కుదిపేసిన సంఘటనగా వివేకానంద హత్య మిగిలిపోయిందని చెప్పారు. వివేకాను రాజకీయంగా ఎదుర్కోలేక హత్యకు కుట్ర జరిగే అవకాశాలు లేకపోలేదని ఆనాడూ భావించామన్నారు. హత్య జరిగిన తర్వాతి వరస పరిణామాలు గందరగోళంలోకి నెట్టాయని, జగన్ను సీఎం చేయాలని కోరుకున్న వారిలో మొదటి వ్యక్తిగా నిలిచిన వివేక చనిపోవడం జగన్కు, ఆయన కుటుంబానికి, పులివెందుల వైసీపీ కార్యకర్తలకు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. అందరూ వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్న తరుణంలో వివేకా హత్య కేసుపై సీబీఐ ఛార్జ్షీట్ పేరుతో తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని పేర్కొన్నారు. వివేకా హత్యకు జరిగిన కుట్ర కన్నా హేయమైన కుట్రగా కనిపిస్తున్నదన్నారు. సీబీఐ ఛార్జ్షీట్ పేరుతో కేసుతో సంబంధంలేని వారిని ఇరికించే కుట్ర జరుగుతున్నట్లు క్లియర్గా కనిపిస్తున్నదని చెప్పారు.
ఎన్నికల సమయంలో అవినాష్రెడ్డి విజయం కోసం వివేకా పరితపించారు, ప్రచారంలో పాల్గొన్నారని సజ్జల చెప్పారు. శివప్రకాశ్రెడ్డి ఫోన్ చేసి చెప్తేనే అవినాష్ రెడ్డికి విషయం తెలిసి.. వెంటనే వివేకా ఇంటికి వెళ్లారన్నారు. మర్డర్ జరిగినట్లుగా తెలిపే లెటర్ను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం, వైసీపీ పార్టీ, ఎంపీ పరువు తీయాలనే తపన స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. మార్చి 15 న హత్య జరగ్గా.. మే 30 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, సిట్ రికార్డులన్నీ అక్కడే ఉన్నాయని గుర్తుచేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక అదే అధికారులు కొనసాగిన విషయం మరిచిపోవద్దన్నారు. కొందరి పేర్లు చెప్పాలంటూ సీబీఐ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని అనుమానితులు ఆరోపిస్తున్నారంటే కుట్ర ఎలా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చునని చెప్పారు.