Amaravati | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రి కౌశల్కుమార్ సోమవారం రాజ్యసభలో రాతపూర్వకంగా వెల్లడించారు. దేశంలో త్రిపుర, నాగాలాండ్కే మాస్టర్ ప్లాన్లు లేవని, మిగతా అన్ని రాష్ర్టాలకు మాస్టర్ ప్లాన్లు ఉన్నాయని తెలిపారు.
సోమవారం ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా.. 28 రాష్ట్రాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ అంశంపై రాజ్యసభలో విపక్ష నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ మంత్రి కౌశల్ కుమార్ రాతపూర్వక సమాధానమిచ్చారు. ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతే అన్న విషయాన్ని స్పష్టంగా వివరించారు. ఏపీ రాజధాని అమరావతి సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయని వెల్లడించారు. త్రిపుర రాజధాని అగర్తల, నాగాలాండ్ రాజధాని కోహిమా మినహా మిగతా రాజధానులకు మాస్టర్ ప్లాన్స్ ఎప్పుడో ఆమోదించామని వివరించారు.