అమరావతి : స్వాతంత్య్ర సమరయోధులు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఏడాదిపాటు నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఆవిష్కరించారు. ప్రధాని పర్యటన ముగిసిన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అల్లూరి విగ్రహాన్ని ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.ఏడాది పాటు నిర్వహించే అల్లూరి జయంతి ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అల్లూరి సంచరించే ప్రాంతాలను పిల్లలను తీసుకెళ్లి చూయించే కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అల్లురి జన్మించిన, బలైన ప్రాంతాలను, పెరిగిన గృహాన్ని భారత ప్రభుత్వం తరుఫున భద్రపరిచి, వాటిని పవిత్రమైన స్థలాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.
35 కోట్ల రూపాయలతో లంబసింగిలో అల్లూరి మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 7 కోట్లను అడ్వాన్స్గా అందజేసామని ఆయన వెల్లడించారు.